న్యూఢిల్లీ: బీహార్ సంకీర్ణ సర్కారులో భాగస్వాములుగా జేడీయూ, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. జేడీయూ నేతలు హద్దుల్లో ఉండాలని, లేదంటే బీహార్లోని తమ 76 లక్షల మంది కార్యకర్తలు తగిన సమాధానం చెబుతారని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్ హెచ్చరించారు. ఈ రెండు పార్టీల మధ్య గొడవకు కింగ్ అశోకపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రముఖ రచయిత దయా ప్రకాష్ సిన్హా కేంద్ర బిందువయ్యారు.
అశోకుడి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన దయాప్రకాష్ సిన్హా నుంచి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలని జేడీయూ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. దీనిపై బీహార్ బీజేపీ చీఫ్ జైస్వాల్ మండిపడ్డారు. ప్రధానితో ట్విట్టర్లో ఆటలాడటం మానుకోవాలన్నారు. జేడీయూ నేతలు హద్దులు మీరితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
బీహార్లోని 76 లక్షల మంది బీజేపీ కార్యకర్తలు జేడీయూ నేతలకు తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. జేడీయూ జాతీయాధ్యక్షుడు రాజీవ్ రంజన్, పార్లమెంటరీ బోర్డు ఛైర్మన్ ఉపేంద్ర కుశ్వాహ.. దయాప్రకాష్కు ఇచ్చిన అవార్డును వెనక్కి తీసుకోవాలని ప్రధానిని డిమాండ్ చేయడం మతిలేని పని అని ఆయన విమర్శించారు. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం దయా ప్రకాష్ను అరెస్ట్చేసి జైల్లో పెట్టొచ్చని జైస్వాల్ వ్యాఖ్యానించారు.