ఢిల్లీ : రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ఇప్పటికే 1.80 కోట్ల కొవిడ్-19 వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని వీటికి తోడు రానున్న మూడు రోజుల్లో మరో 48 లక్షల కొవిడ్ వ్యాక్సిన్లను రాష్ట్రాలు అందుకోనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సోమవారం తెలిపింది. ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమం కింద కేంద్రం ఇప్పటివరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 21.80 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసింది. ఇందులో మే 23 వరకు సగటున వృథాతో సహా 20,00,08,875 డోసులను వినియోగించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇంకా 1.80 కోట్ల వ్యాక్సిన్ డోసులు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ఉన్నాయని వీటికి అదనంగా రానున్న మరో మూడు రోజుల్లో 48,00,650 వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. దేశవ్యాప్త టీకా డ్రైవ్లో భాగంగా రాష్ట్రాలు, యూటీలకు కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్లను అందిస్తోంది.