న్యూఢిల్లీ: ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్ముకశ్మీర్కు సరైన సమయంలో రాష్ట్రహోదా కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదా ఎప్పుడు కల్పిస్తారంటూ రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ విధంగా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జమ్ముకశ్మీర్లో సాధారణ పరిస్థితులు పునరుద్ధరించబడిన తర్వాత సరైన సమయం చూసి రాష్ట్ర హోదా కల్పిస్తామని నిత్యానంద్ రాయ్ తన సమాధానంలో పేర్కొన్నారు.
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాలు ప్రస్తుతం తగ్గాయని నిత్యానంద్ రాయ్ రాజ్యసభకు తెలిపారు. 2019తో పోల్చితే 2020లో ఉగ్రవాద ఘటనలు 59 శాతం తగ్గాయని పేర్కొన్నారు. అదేవిధంగా 2020లో జూన్ వరకు జరిగిన ఉగ్రవాద ఘటనలతో పోల్చితే 2021 జూన్ వరకు జరిగిన ఉగ్రవాద ఘటనలు 32 శాతం తగ్గాయని ఆయన తెలిపారు.