న్యూఢిల్లీ, జూలై 16: షెడ్యూల్డ్ కులాల జాబితాలో మార్పులు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. బీహార్లో ఈబీసీ జాబితా నుంచి ‘తంతి-తంత్వ’ సామాజికవర్గాన్ని తొలగించి, షెడ్యూల్డ్ కులాల జాబితాలో ఉన్న ‘సావాసి’లో కలుపుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం 2015లో ఇచ్చిన నోటిఫికేషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 341లో ప్రచురించిన షెడ్యూల్డ్ కులాల జాబితాలో మార్పులు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. క్లాజ్-1లో పొందుపరిచిన ఎస్సీ కులాల జాబితాను పార్లమెంటులో చట్టం ద్వారానే మార్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నది. ఆర్టికల్ 341 ప్రకారం.. పార్లమెంటులో చట్టం చేయకుండా ఈ జాబితాలో మార్పులు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రపతికి కూడా ఉండదని ధర్మాసనం తెలిపింది.