కోల్కతా: ‘వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో మాకు 35 ఎంపీ సీట్లు ఇవ్వండి. 2025లోగా రాష్ట్రంలోని టీఎంసీ ప్రభుత్వం కూలిపోతుంది’ అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్షా ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ఒక బాధ్యతాయుత పదవిలో ఉండి.. ప్రభుత్వాలను కూల్చే వ్యాఖ్యలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. అమిత్షా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ బిర్భూమ్ జిల్లాలో శుక్రవారం జరిగిన సభలో అమిత్షా చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన అలా ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. పశ్చిమబెంగాల్ ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చేందుకు అమిత్షా కుట్రలు చేస్తున్నారనే రహస్యం దీని ద్వారా వెల్లడైందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో టీఎంసీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం అడ్డుకొంటున్నదని మమత ఆరోపించారు. ఇందులో భాగంగా పరిశీలన పేరుతో కేంద్ర బృందాలను ఒకదాని తర్వాత ఒకటిగా పంపుతున్నదని అన్నారు. రాష్ర్టానికి రావాల్సిన నిధులను కూడా నిలిపివేసిందని బీజేపీ ప్రభుత్వ తీరును తూర్పారబట్టారు. టీఎంసీ బలాన్ని తగ్గించే కుట్రలో భాగంగా పలు కేసుల పేరుతో కేంద్రం టీఎంసీ ఎమ్మెల్యేలను దర్యాప్తు సంస్థల చేత అరెస్టులు చేయిస్తున్నదని ఆరోపించారు. 2024 లోక్సభ ఎన్నికల్లోగా బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకం కావాలని ఈ సందర్భంగా మమత మరోసారి పిలుపునిచ్చారు.
2019 లోక్సభ ఎన్నికలకు ముందు జరిగిన పుల్వామా దాడి ఘటనపై మమత పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఉగ్రదాడి వెనుక ఏదో స్టోరీ ఉన్నదని అన్నారు. ఒక్క కేంద్ర దర్యాప్తు సంస్థ బృందం అయినా ఘటనాస్థలికి వెళ్లిందా? అని ప్రశ్నించారు.