ముంబై: క్రూయిజ్ డ్రగ్స్ కేసులో ఎన్సీబీ అరెస్ట్ చేసిన కుమారుడు ఆర్యన్ ఖాన్కు బెయిల్ లభించడంపై బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కుటుంబం ఊరట చెందింది. ఆర్యన్ ఖాన్కు బెయిల్ కోసం కోర్టుల్లో పోరాడిన లాయర్ల బృందంతో కలిసి ఆయన ఫొటోలు దిగారు. సీనియర్ న్యాయవాది అమిత్ దేశాయ్, సుశాంత్ కేసులో రియా చక్రవర్తి బెయిల్ కోసం వాదించిన న్యాయవాది సతీష్ మానేషిండే, ఇతర న్యాయవాదుల బృందంతో షారూఖ్ ఖాన్ దిగిన ఫొటోలను న్యాయవాద సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఈ కేసును బాంబే హైకోర్టులో వాదించిన మాజీ అటార్నీ జనరల్, సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ ఈ ఫొటోలో కనిపించలేదు.
కాగా, మూడు వారాల పాటు జైలులో ఉన్న తన కుమారుడు ఆర్యన్ ఖాన్ గురువారం బెయిల్ పొందిన తర్వాత షారూఖ్ ఖాన్ తీసుకున్న మొదటి ఫోటో ఇది. అక్టోబర్ 14న కుమారుడ్ని కలిసేందుకు ఆర్థర్ రోడ్ జైలును సందర్శించిన ఆయన మీడియా కంటపడ్డారు. మరోవైపు కుమారుడి అరెస్ట్ సమయంలో విదేశాల్లో షూటింగ్లో ఉన్న షారూఖ్ వెంటనే భారత్కు వచ్చారు. నాటి నుంచి ఇప్పటి వరకు ఈ కేసుపై ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు.