బెంగళూరు: కొట్లాటలో ఒక వ్యక్తి మరో వ్యక్తి వృషణాలను పిసకడాన్ని హత్యాయత్నంగా పరిగణించలేమని కర్ణాటక హైకోర్టు పేర్కొన్నది. దాన్ని హత్యాయత్నం నేరంగా పరిగణిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పుతో హైకోర్టు విభేదించింది. నిందితుడు బాధితుడిని చంపాలనే ఉద్దేశంతో ఆ నేరానికి పాల్పడలేదు కాబట్టి దాన్ని హత్యాయత్నం అనలేమని పేర్కొంది. ఆ మేరకు నిందితుడికి కింది కోర్టు విధించిన ఏడేళ్ల జైలు శిక్షను మూడేళ్లకు తగ్గించింది.
వివరాల్లోకి వెళ్తే.. 2010లో చిక్మంగళూరు జిల్లా కడూర్ తాలూకాలోని ముగలికట్టె అనే గ్రామంలో నరసింహస్వామి ఉత్సవాలు జరిగాయి. స్వామివారి ఊరేగింపు సందర్భంగా ఇతర గ్రాస్తులతో కలిసి ఓంకారప్ప నృత్యం చేస్తుండగా పరమేశ్వరప్ప అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు. వచ్చీరావడంతోనే ఓంకారప్పతో గొడవకు దిగాడు. ఇద్దరూ కొట్టుకున్నారు. ఈ సందర్భంగా పరమేశ్వరప్ప.. ఓంకారప్ప వృషణాలను బలంగా పిసికాడు.
దాంతో ఓంకారప్ప నొప్పితో విలవిల్లాడాడు. కుటుంబసభ్యులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు వృషణాలు బాగా దెబ్బతిన్నాయని చెప్పి వాటిని పూర్తిగా తొలగించారు. దీనిపై బాధితుడు ఓంకారప్ప పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు హత్యాయత్నం అభియోగాలు మోపి నిందితుడు పరమేశ్వరప్పను చిక్మంగళూరు ట్రయల్ కోర్టులో హాజరుపర్చగా.. 2012లో కోర్టు అతనికి ఏడేళ్ల జైలుశిక్ష విధించింది.
దాంతో నిందితుడు పరమేశ్వరప్ప తనకు ఓంకారప్పను చంపాలనే ఉద్దేశమే లేదని, కొట్లాటలో అనుకోకుండా అలా చేయాల్సి వచ్చిందని పేర్కొంటూ అదే ఏడాది ట్రయల్ కోర్టు తీర్పును కర్ణాటక హైకోర్టులో సవాల్ చేశాడు. ఈ కేసులో పలుమార్లు విచారణ అనంతరం తాజాగా కర్ణాటక హైకోర్టు తీర్పు వెలువరించింది. నిందితుడు ఉద్దేశపూర్వకంగా నేరానికి పాల్పడలేదంటూ హత్యాయత్నం అభియోగాలను రద్దుచేసి.. జైలుశిక్షను మూడేళ్లకు తగ్గించింది.