న్యూఢిల్లీ : భారత్ లో అత్యవసర వాడకానికి ఆమోదం పొందిన కొవిడ్-19 వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ త్వరలో అందుబాటులోకి రానుంది. జూన్ రెండో వారంలో అపోలో దవాఖానల ద్వారా స్పుత్నిక్ వీ అందుబాటులోకి వస్తుందని అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్ పర్సన్ శోభనా కామినేని గురువారం వెల్లడించారు. మరోవైపు ఢిల్లీకి వ్యాక్సిన్ సరఫరాలపై స్పుత్నిక్ వీ తయారీదారు సంసిద్ధత వ్యక్తం చేశారని దీనిపై కంపెనీ ప్రతినిధులతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.
ఇక ముంబై, కర్నాటకకు వ్యాక్సిన్ సరఫరాలపైనా స్పుత్నిక్ వీ సానుకూలంగా స్పందించింది. కాగా భారత్ కు దశలవారీగా 85 కోట్ల వ్యాక్సిన్ డోసుల సరఫరాకు రష్యా సన్నాహాలు చేపట్టిందని రష్యాకు భారత్ రాయబారి డీ బాల వెంకటేష్ వర్మ ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే.