న్యూఢిల్లీ / బీజింగ్: భారత్కు చెందిన అరుణాచల్ ప్రదేశ్ క్రీడాకారులకు వీసాను చైనా నిరాకరించింది. ఆసియా క్రీడల్లో (Asian Games) వారు పాల్గొనకుండా అడ్డుకున్నది. భారత్ దీనిపై నిరసన తెలిపింది. అలాగే చైనాలోని హాంగ్జౌలో శనివారం జరుగనున్న ఆసియా గ్రేమ్స్ ప్రారంభ వేడుకలో పాల్గొనకూడదని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో చైనా పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి శుక్రవారం ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. చైనాలోని హాంగ్జౌలో జరుగనున్న 19వ ఆసియా క్రీడలకు అక్రిడిటేషన్, ప్రవేశాన్ని నిరాకరించడం ద్వారా అరుణాచల్ ప్రదేశ్కు చెందిన కొంత మంది భారతీయ క్రీడాకారుల పట్ల చైనా అధికారులు వివక్ష చూపారని ఆరోపించారు.
కాగా, అరుణాచల్ ప్రదేశ్ తమ అంతర్భాగమని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రాంతం, జాతి ఆధారంగా భారతీయ పౌరుల పట్ల చైనా వివక్ష చూపడాన్ని నిరాకరిస్తున్నట్లు తెలిపింది. ఆసియా క్రీడల స్ఫూర్తిని చైనా ఉల్లంఘించినట్లు విమర్శించింది. ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయంతోపాటు, బీజింగ్లో కూడా దీనిపై నిరసన వ్యక్తం చేసినట్లు వెల్లడించింది.
మరోవైపు 19వ ఆసియా క్రీడలు చైనాలోని హాంగ్జౌలో ఈ నెల 19 నుంచి ప్రారంభమయ్యాయి. అయితే ఈ నెల 23న అధికారిక ప్రారంభ వేడుక నిర్వహించనున్నారు. శనివారం జరిగే ఈ కార్యక్రమంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పాల్గొంటారు. అక్టోబర్ 8 వరకు ఆసియా క్రీడలు కొనసాగనున్నాయి.