నాగాలాండ్ లో సామాన్య పౌరులపై ఆర్మీ జరిపిన కాల్పుల ఉదంతంపై నాగా తిరుగుబాటు బృందం తీవ్రంగా స్పందించింది. ప్రతి రక్తపు బొట్టుకు అతి త్వరలోనే సమాధానం చెప్పి తీరుతామని, తగిన ప్రతీకారం తీర్చుకుంటామని తీవ్ర స్వరంతో హెచ్చరించింది. అయితే ఈ సమాధానం అతి త్వరలోనే ఉంటుందా, కొన్ని రోజుల తర్వాత ఉంటుందా అన్నది మాత్రం చెప్పలేమని పేర్కొంది. ఈ మేరకు తిరుగుబాటు బృందం ఓ లేఖను విడుదల చేసింది. అయితే ఇలా ప్రతికారం తీర్చుకుంటే మాత్రం, తాము ఎందుకు అలా చేశామన్న విషయంలో నాగా ప్రజలకు ఓ స్పష్టమైన అవగాహన ఉందనే తాము భావిస్తున్నట్లు నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ ప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
శాంతియుతంగానే ఉండాలన్నదే తమ ప్రజల అభిమతమని, ఈ అభిమతాన్ని గమనంలోకి తీసుకునే తాము, ఇప్పటి వరకూ మిలటరీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు చేపట్టకుండా ఓపికతో ఉంటూవచ్చామని సంస్థ పేర్కొంది. తాము ఇంత శాంతియుతంగా ఉన్నా, ఈ దారిలో తాము సాధించిందేమీ లేదని తెలిపింది. హత్యలు, అత్యాచారాలు, చెప్పలేనటువంటి బాధలే తమకు మిగిలాయని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్మీ కాల్పుల్లో మరణించిన పౌరులకు నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ సంతాపాన్ని ప్రకటించింది.