చెన్నై : తమిళనాడులోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఓ దివ్యాంగురాలు మెడిసిన్లో సీటు పొందిన తొలి యువతిగా నిలిచింది. శ్యాంసియా ఆర్ఫిన్(18) అనే యువతి చిన్నప్పట్నుంచి చదువుల్లో చురుకుగా ఉండేది. కానీ ఆమె పుట్టుకతోనే దివ్యాంగురాలు కావడంతో.. వైద్యం కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగేది. దాంతో తాను భవిష్యత్లో డాక్టర్ను అయి తనలాంటి వారికి సహాయం చేయాలని ఆర్ఫిన్ నిర్ణయించుకుంది.
ఈ సందర్భంగా ఆర్ఫిన్ మీడియాతో మాట్లాడుతూ.. తన నాన్న ముథాలిఫ్ కూడా శారీరక వికలాంగుడు. తాను దివ్యాంగురాలిని. వైద్యం కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగేదాన్ని. ఆస్పత్రుల్లో చికిత్సకు వెళ్లినప్పుడల్లా ఎంబీబీఎస్ చదవాలనే ఆకాంక్ష బాగా ఉండేది. దానికనుగుణంగా బాగా చదివి నీట్లో ఉత్తీర్ణత సాధించాను. చెన్నైలోని ప్రతిష్టాత్మకమైన గవర్నమెంట్ స్టాన్లీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు పొందాను. ఇప్పుడు తన సంతోషానికి అవధుల్లేవు అని పేర్కొన్నది. డాక్టర్లు ఎంతో మానవత్వంతో వైద్యం చేస్తారని, ఆ వృత్తిని ఎల్లప్పుడూ గౌరవిస్తానని ఆర్ఫిన్ తెలిపింది. భవిష్యత్లో గైనకాలజిస్ట్ను అవుతానని చెప్పింది.
ఆర్ఫిన్ విద్యాభ్యాసం ప్రభుత్వ పాఠశాలలోనే కొనసాగింది. ఈమెకు చదువుపై ఉన్న ఆసక్తిని గమనించిన ఓ కోచింగ్ సెంటర్ ఉచితంగా నీట్ ఎగ్జామ్కు ప్రిపేర్ చేయించింది. ఆర్ఫిన్ నీట్ తరగతులకు హాజరయ్యేందుకు ఉచితంగా బస్సు సౌకర్యం కూడా ఆ కోచింగ్ సెంటరే కల్పించింది. మొత్తానికి అందరి సహాయ సహకారాలతో ఆర్ఫిన్ నీట్లో ఉత్తీర్ణత సాధించి, ఎంబీబీఎస్లో సీటు పొందింది.