నీట్ మినహాయింపు వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో కొత్త వివాదానికి తెరలేపింది.ఈ విషయంలో సీఎం స్టాలిన్, గవర్నర్ రవి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. నీట్ పరీక్ష నుంచి రాష్ట్రానికి మినహాయింపును ఇవ్వాలని అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్ రవి తిప్పి పంపించారు. దీంతో వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి స్టాలిన్ శనివారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 10 పార్టీలు హాజరయ్యాయి. డీఎంకే, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, పీఎంకే, వీసీకేతో పాటు పలు పార్టీలు హాజరయ్యాయి. ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ గవర్నర్ రవి తీరుపై అఖిలపక్షంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
గవర్నర్ నీట్ బిల్లును 142 రోజుల పాటు తనవద్దే ఉంచుకొన్నారని, సరిగ్గా మెడికల్ అడ్మిషన్లు ప్రారంభమైన సమయంలోనే స్పీకర్కు పంపించారని స్టాలిన్ ఆరోపించారు. మరోవైపు అఖిలపక్ష సమావేశం నీట్ బిల్లుపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లును తిరిగి గవర్నర్కు పంపాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. నీట్ బిల్లు విషయంపై ఫిబ్రవరి 8న అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచాలని, అక్కడి నుంచే తిరిగి గవర్నర్కు ఈ బిల్లును తిరిగి పంపాలని అఖిలపక్షం నిర్ణయించుకుంది.