న్యూఢిల్లీ, ఆగస్టు 29: మాతృ భాషలో మాట్లాడటాన్ని ప్రజలు గర్వంగా భావించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. భారతీయ భాషలను మాట్లాడటంలో ఎలాంటి ఆత్మన్యూనతా భావం అవసరం లేదని పేర్కొన్నారు. ఆదివారం తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని వర్చువల్గా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తికి నివాళులు అర్పించారు. భారతీయ భాషలకు వినూత్నమైన మార్గాల్లో విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. భాష అనేది స్థిరమైనది కాదని చెప్పారు. భాషను సుసంపన్నం చేసుకోవడానికి మార్పుకు అనుగుణమైన క్రియాశీల విధానాలను అవలంబించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో సాంస్కృతిక, భాషా పునరుజ్జీవనానికి ప్రజలు మద్దతు ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు.