ఇటీవలే జైలు నుంచి విడుదలైన సమాజ్వాదీ కీలక నేత ఆజంఖాన్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయన్ను ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో చేర్పించారు. ఛాతీ నొప్పి రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయని, దీంతో ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించామని ఆజంఖాన్ సన్నిహితులు పేర్కొన్నారు.
శనివారం అర్ధరాత్రి ఒక్కసారిగా ఆయన ఆరోగ్యం క్షీణించిందని కుటుంబీకులు తెలిపారు. దీంతో ఆయన్ను ఢిల్లీకి తీసుకొచ్చామని పేర్కొన్నారు. అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో ఆయన ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో చేరగానే.. వైద్యులు పరీక్షలు నిర్వహించారు.
ఈ నెల 20 న సీతారాం పూర్ జైలు నుంచి ఆజంఖాన్ విడుదలయ్యారు. చీటింగ్ కేసు, భూ కబ్జాలతో సహా ఆయనపై పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన 27 నెలలుగా జైలు శిక్ష అనుభవించారు. సుప్రీం కోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.