లక్నో: ఉత్తరప్రదేశ్కు చెందిన సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) నేత ఆజం ఖాన్కు కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ద్వేషపూరిత ప్రసంగం కేసులో ఆయనను దోషిగా గురువారం నిర్ధారించిన కోర్టు అనంతరం శిక్షను ఖరారు చేసింది. రూ.6,000 జరిమానా విధించింది. అయితే వారం రోజుల్లో ఉన్నత కోర్టులో అపీల్ కోసం బెయిల్ కూడా మంజూరు చేసింది. దీంతో అపీల్కు వెళ్లకపోతే జైలు నుంచే ఎమ్మెల్యేగా గెలిచిన ఆజం ఖాన్, అసెంబ్లీ సభ్యత్వాన్ని కోల్పోనున్నారు.
2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అప్పటి జిల్లా కలెక్టర్ ఆంజనేయ కుమార్ సింగ్లను ఉద్దేశించి రెచ్చగొట్టేలా ఆయన ప్రసంగించారు. దేశంలో ముస్లింల ఉనికికి కష్టతరమైన వాతావరణాన్ని ప్రధాని సృష్టిస్తున్నారని విమర్శించారు. ఈ నేపథ్యంలో 2019లో ఆజం ఖాన్పై నమోదైన కేసుపై రాంపూర్ కోర్టు విచారణ జరిపింది. ఎట్టకేలకు గురువారం తీర్పు ఇచ్చింది. ఆయనను దోషిగా నిర్ధారించడంతోపాటు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.
కాగా, 2017లో ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్పీ నేత ఆజం ఖాన్పై 90కు పైగా కేసులు నమోదయ్యాయి. భూ ఆక్రమణ కేసులో అరెస్టైన ఆయన రెండేళ్లపాటు జైలులో ఉన్నారు. జైలు నుంచే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఈ ఏడాది మేలో జైలు నుంచి విడుదలయ్యారు. అయితే ద్వేషపూరిత ప్రసంగం కేసులో రాంపూర్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఈ తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తానని ఆజం ఖాన్ తెలిపారు.