చండీగఢ్: బాలీవుడ్ నటుడు సోనూ సూద్ను పోలీసులు అడ్డుకున్నారు. ఆయన కారును స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్లోని మోగా జిల్లాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. సోనూ సూద్ సోదరి మాళవికా సూద్ సచార్ కాంగ్రెస్ అభ్యర్థిగా మోగా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆదివారం పంజాబ్లో పోలింగ్ నేపథ్యంలో మోగాలోని పలు పోలింగ్ బూత్లను సందర్శించేందుకు సోనూ సూద్ కారులో బయలుదేరారు.
కాగా, సోనూ సూద్ ఓటర్లను ప్రభావితం చేసేందుకు మోగాలోని పోలింగ్ బూత్లకు వెళ్తున్నారంటూ శిరోమణి అకాలీదళ్ ఈసీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఎన్నికల అధికారులు, పోలీసులు సోనూ సూద్ను పోలింగ్ బూత్లకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఆయన కారును స్వాధీనం చేసుకున్నారు. ‘సోనూ సూద్ పోలింగ్ బూత్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. దీంతో ఆయన కారును సీజ్ చేసి ఇంటికి పంపాం. ఆయన ఇంటి నుంచి బయటకు వస్తే చర్యలు తీసుకుంటాం’ అని మోగా జిల్లా అధికారి ప్రద్బ్దీప్ సింగ్ తెలిపారు. మోగా జిల్లా మేజిస్ట్రేట్ హరీష్ నయ్యర్ ఈ ఘటనపై ఎస్ఎస్పీని నివేదిక కోరారు.
మరోవైపు పోలీసులు తనను అడ్డుకుని కారును సీజ్ చేసిన అనంతరం సోనూ సూద్ ఒక ట్వీట్ చేశారు. మోగా నియోజకవర్గంలో మిగతా అభ్యర్థులు ఓటర్లను డబ్బులతో కొంటున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అందులో కోరారు.
అలాగే సోనూ సూద్ మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలు, ముఖ్యంగా అకాలీదళ్ నేతల నుంచి వివిధ పోలింగ్ బూత్లకు బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు తనకు తెలిసిందని అన్నారు. కొన్ని బూత్లలో డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు కూడా సమాచారం అందిందని చెప్పారు. దీంతో తనిఖీలు చేసి నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూడడం తమ కర్తవ్యమని అన్నారు. అందుకే తాను బయటకు వెళ్లినట్లు వివరించారు. ప్రస్తుతం తాను ఇంట్లోనే ఉన్నానని తెలిపారు. అయితే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగాలని డిమాండ్ చేశారు.
Other Candidates in #Moga Constituency are buying votes.@ECISVEEP should take immediate action regarding the same.@DproMoga @MogaPolice @DGPPunjabPolice @PunjabPoliceInd
— sonu sood (@SonuSood) February 20, 2022