న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఇవాళ లోక్సభలో చర్చ జరగనున్నది. కాంగ్రెస్ పార్టీ తరపున సోనియా గాంధీ(Sonai Gandhi) చర్చను ప్రారంభించనున్నారు. లోక్సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నారీ శక్తి వందన్ అధినియమ్ బిల్లును ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. గతంలో మన్మోహన్ సర్కార్ 2010లో మహిళా రిజర్వేషన్ బిల్లును రాజ్యసభలో పాస్ చేసింది. ఇవాళ ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైన తర్వాత ఈ బిల్లుపై చర్చించనున్నది. బీజేపీ తరపున ఈ బిల్లుపై నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, భారతి పవార్, అపరాజిత్ సారంగి, సునితా దుగ్గల్, దియా కుమారి మాట్లాడనున్నారు.
35 ఏండ్ల నిరీక్షణకు తెరదించుతూ మహిళాబిల్లును కేంద్రప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది. దీనిపై బుధవారం 7 గంటలపాటు చర్చ జరుగనున్నది. అనేక పక్షాలు మద్దతిస్తున్న నేపథ్యంలో మహిళా బిల్లు ఆమోదం ఖాయంగా కనిపిస్తున్నది. అధికార పక్షానికి పూర్తిబలం ఉండటం, బీఆర్ఎస్ సహా పలు పార్టీలు ఇప్పటికే బిల్లుకు మద్దతు ప్రకటించడంతో.. పార్లమెంట్ ఆమోదం పొందడం లాంఛనమే కానున్నది.
పార్లమెంటు ఆమోదం పొందితే మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారుతుందే తప్ప, అది అమల్లోకి వచ్చేది 2027 తర్వాతే. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన పూర్తి చేసుకుని, పలు అడ్డంకులను దాటుకున్నాకే చట్టం కార్యరూపం దాలుస్తుంది. అదే జరిగితే ఇప్పుడు 82మంది మహిళా ఎంపీలున్న లోక్సభలో 181మంది అతివల ప్రాతినిధ్యాన్ని చూడొచ్చు.