పనాజీ: బీజేపీ మహిళా నాయకురాలు, టిక్టాక్ స్టార్ సోనాలీ ఫోగట్ హత్య కేసులో దోషులకు కఠిన శిక్ష తప్పదని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ చెప్పారు. ఘటన జరిగిన నాటి నుంచి కేసు దర్యాప్తులో తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తున్నదని ఆయన తెలిపారు. ఈ కేసులో దోషులను గోవా పోలీసులు నూటికి నూరుపాళ్లు శిక్షించి తీరుతారని పేర్కొన్నారు.
ప్రస్తుతం నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారని, కేసు దర్యాప్తు కొనసాగుతున్నదని ప్రమోద్ సావంత్ వెల్లడించారు. ఇటీవల గోవాలోని అంజునా బీచ్లోగల ఓ క్లబ్లో పార్టీకి హాజరైన సోనాలీ ఫోగట్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అయితే మరణానికి ముందు ఆమెతో ఆమె సహచరుడు సుధీర్సంగ్వాన్ బలవంతంగా ఏదో మత్తుపదార్థం కల్పిన పానీయం తాగించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అందుకే అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సోనాలీ సహచరులైన సుధీర్ సంగ్వాన్తోపాటు సుఖ్విందర్ సింగ్ను ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు తాజాగా మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.
తాజాగా అరెస్టయిన వారిలో పార్టీ జరిగిన క్లబ్ ఓనర్, డ్రగ్స్ సరఫరా చేసిన డీలర్ దత్ప్రసాద్ గోంకర్ ఉన్నారు. తాజా అరెస్టులతో ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లయ్యింది.