పనాజీ: సోనాలీ ఫోగట్ మృతి కేసులో ఆదివారం మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే సోనాలీ సహచరుడు సుధీర్ సంగ్వాన్, అతని సహాయకుడు సుఖ్విందర్సింగ్, కర్లీస్ రెస్టారెంట్ (క్లబ్) యజమాని ఎడ్విన్ న్యూన్స్, డ్రగ్స్ పెడ్లర్ దత్తప్రసాద్ గోంకర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తాజాగా మరో డ్రగ్ పెడ్లర్ రమా మంద్రేకర్ను అరెస్ట్ చేశారు. దాంతో ఈ కేసులో మొత్తం అరెస్టుల సంఖ్య ఐదుకు చేరింది.
సుధీర్ సంగ్వాన్, సుఖ్విందర్ సింగ్లను శనివారమే కోర్టులో హాజరుపర్చగా కోర్టు ఆ ఇద్దరికీ 10 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. ఇవాళ మిగతా ముగ్గురు నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. ముగ్గురికీ కోర్టు ఐదు రోజుల పోలీస్ రిమాండ్ విధించింది. ఎడ్విన్ న్యూన్స్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను కూడా న్యాయస్థానం తోసిపుచ్చింది.
బీజేపీ మహిళా నాయకురాలు, టిక్టాక్ స్టార్ అయిన 42 ఏండ్ల సోనాలీ ఫోగట్.. ఆగస్టు 23న ఉత్తర గోవాలోని అంజునా ఏరియాలోగల సెయింట్ ఆంటోనీ ఆస్పత్రిలో మరణించారు. అంతకుముందు అంజునా బీచ్లోని కర్లీస్ రెస్టారెంట్లో సహచరులతో కలిసి ఆమె పార్టీలో పాల్గొన్నారు. ఆ పార్టీలో సుధీర్ సంగ్వాన్ మత్తుమందు తాగించడంతో అస్వస్థతకు గురైంది. దాంతో ఆమెను సెయింట్ ఆంటోనీ ఆస్పత్రికి తరలించారు.