చండీగఢ్: పంజాబ్లో అసెంబ్లీ సెషన్ నిర్వహణకు గవర్నర్ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం.. ఇవాళ సభలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ మండిపడ్డాయి. జీఎస్టీ, విద్యుత్, కొయ్యకాలు కాల్చివేత సమస్యపై చర్చ కోసం అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేసిన ఆప్ సర్కారు.. సభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంపై విమర్శలు గుప్పించాయి.
ప్రభుత్వంపై విశ్వాసం నిరూపించుకోవాలంటే అసెంబ్లీని రద్దుచేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశాయి. అనంతరం ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీజేపీ సభ నుంచి వాకౌట్ చేసింది. రభస చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను స్పీకర్ ఆదేశాల మేరకు మార్షల్స్ బయటికి లాక్కెళ్లారు. దాంతో ఆప్ ఎమ్మెల్యేలతో పాటు బీఎస్పీ, ఎస్ఏడీ ఎమ్మెల్యేలు మాత్రమే సభలో ఉన్నారు.
కాగా, ప్రతిపక్షాల తీరుపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మంచి దోస్తీ ఉన్నదని, అది ఈరోజు సభలో రుజువైందని ఎద్దేవా చేశారు. బీజేపీయే కాదు, కాంగ్రెస్ కూడా సభను అడ్డుకుంటున్నదని, మమ్మల్ని నోరు తెరువనివ్వడం లేదని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఎమ్మెల్యేలను షేర్ చేసుకుంటున్నాయని ఆరోపించారు.