నేషనల్ డెస్క్: రానున్న రోజుల్లో విపరీతంగా పెరుగనున్న విద్యుత్తు డిమాండ్ను అధిగమించడానికి చైనా ఓ బృహత్తర ప్రణాళికను రూపొందించింది. భూమి మీద కాకుండా ఏకంగా రోదసిలోనే సోలార్ ప్యానెల్స్తో (సౌర ఫలకాలతో) ఓ భారీ కేంద్రాన్ని నిర్మించనున్నది. వాతావరణాన్ని కలుషితం చేసే కర్బన ఉద్గారాలను 2060నాటికి శూన్యస్థితికి తీసుకురావడమే లక్ష్యంగా చేపడుతున్న ఈ ప్రయోగంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
ఏమిటీ ప్రాజెక్ట్?
భూమికి 22,400 వేల మైళ్ల ఎత్తులో జియోస్టేషనరీ కక్ష్యలో చైనా ‘స్పేస్-సోలార్-పవర్ రిసర్చ్ సెంటర్’ పేరిట సౌర ఫలకాలతో కూడిన ఓ భారీ నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నది. సుమారు ఒక మైలు విస్తీర్ణంతో ఉండే ఈ సెంటర్ మీద సమాంతరంగా అమర్చిన సోలార్ ప్యానెల్స్ ఉంటాయి. వాటిపై పడిన సూర్యరశ్మిని విద్యుత్తుగా మార్చి భూమి మీదనున్న పవర్ గ్రిడ్లకు సరఫరా చేస్తారు.
రోదసిలోనే ఎందుకు?
భూమిపైన సౌర విద్యుత్తు సవాల్తో కూడుకున్న విషయం. రాత్రి సమయాలు, వర్షాకాలం, ఆకాశం మేఘావృతం అయిన సందర్భాల్లో విద్యుదుత్పత్తి సాధ్యం కాదు. ఈ అడ్డంకులన్నీ రోదసిలో ఉండవు. అందుకే చైనా ఈ తరహా ప్రయోగాన్ని చేపట్టింది. సౌర ఫలకలు సూర్యరశ్మిని గ్రహించిన అనంతరం ఆ శక్తిని భూమి మీదకు పంపించే క్రమంలో.. మైక్రోవేవ్ ట్రాన్స్మిటర్ సాయంతో మైక్రోవేవ్ తరంగాలుగా మారుస్తారు. ఆ తర్వాత విద్యుత్శక్తిగా పరివర్తనం చేసి పవర్గ్రిడ్లకు ప్రసారం చేస్తారు.
ఎప్పుడు పూర్తవుతుంది? ఖర్చెంత?
ఇప్పటికే ఈ ప్రయోగానికి సంబంధించిన ప్రొటోటైప్ సిద్ధమైంది. 2035లో ఈ వాహకనౌక ఆపరేషన్ మొదలవుతుంది. ప్రాథమికంగా 1 మెగావాట్ సామర్థ్యంతో పనిని ఆరంభించే ఈ పవర్ రిసెర్చ్ సెంటర్.. 2049 నాటికి 1 గిగావాట్ పవర్ను ఉత్పత్తి చేసే సామర్థ్యానికి చేరుకుంటుంది. అంటే మూడు లక్షల గృహాలకు విద్యుత్తును సరఫరా చేసే సామర్థ్యానికి చేరుకుంటుందని అర్థం. ఇది ఒక న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఉత్పత్తి చేసే విద్యుత్తుతో సమానం. ఈ పవర్ రిసర్చ్ సెంటర్ నిర్మాణానికి 1.6 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్టు అంచనా.
నవల ఆధారంగా..
రోదసిలో సోలార్ పవర్ స్టేషన్ నిర్మించాలన్న కాన్సెప్ట్ శాస్త్రవేత్తలకు వచ్చింది కాదు. ప్రఖ్యాత సైన్స్ఫిక్షన్ రచయిత ఐజాక్ అసిమోవ్ 1941లో రాసిన ఓ నవలలో ఈ కాన్సెప్ట్ను ప్రస్తావించారు. దీనిపై ఇప్పటికే అమెరికా, బ్రిటన్ ప్రయోగాలు మొదలెట్టాయి. చైనా ప్రొటోటైప్ను కూడా సిద్ధం చేసింది. ఈ ఏడాది చివరినాటికి రిసెర్చ్ సెంటర్ నిర్మాణం పూర్తవుతుందని సమాచారం.