ముంబై: సమాజంలో ఇతరుల మాట వినే పరిణితి ప్రతి ఒక్కరిలో ఉండాలని సీజేఐ డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. జీవితం ప్రతి దశలోనూ ఇతరుల మాట వినటం చాలా ముఖ్యమన్నారు. శనివారం ముంబైలో జరిగిన సింబయాసిస్ (డీమ్డ్) వర్సిటీ 20వ స్నాతకోత్సవంలో పాల్గొన్న సీజేఐ మాట్లాడుతూ ‘మనం ఇతరుల మాట వినటం లేదు.
మనం మన గురించి మాత్రమే ఆలోచిస్తున్నాం. జీవన ప్రయాణంలో మానవత్వం, ధైర్యాన్ని సహచరులుగా మార్చుకోవాలి’ అని అన్నారు. సమాజంలో నేడు చాలామంది సంపన్న జీవితం కోసం ప్రయత్నిస్తున్నారని, ఇందులో తప్పేమీ లేదని, అయితే ఇది విలువలు, సూత్రాల విషయంలో రాజీపడకుండా ఉండాలన్నారు.
శుక్రవారం ఓ అవార్డు కార్యక్రమంలో సీజేఐ మాట్లాడుతూ కుడి, ఎడమవాదులు, మధ్యేవాదుల ‘పోలరైజేషన్’ ప్రపంచవ్యాప్తంగా కనపడుతున్నదని, భారత్ ఇందుకు భిన్నమేమీ కాదని అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా వల్ల వివిధ వర్గాల మధ్య అసహనం పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.