న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి మాతృ వియోగం జరిగింది. ఆమె తల్లి పవోలా మైనో ఇటలీలోని తన నివాసంలో కన్నుమూశారు. ఆగస్టు 27న ఆమె తుదిశ్వాస విడిచారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ కమ్యూనికేషన్స్ ఇన్చార్జ్ జనరల్ సెక్రెటరీ జైరామ్ రమేశ్ తెలిపారు. ఆగస్టు 31న మైనో అంత్యక్రియలు జరిగినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
అయితే, పవోలా మైనో అంత్యక్రియలకు సోనియాగాంధీ, రాహుల్గాంధీ, ప్రియాంకాగాంధీ వాద్రా హాజరయ్యారా.. లేదా..? అనే వివరాలను జైరామ్ రమేశ్ వెల్లడించలేదు. ఇటలీకి చెందిన సోనియాగాంధీని రాజీవ్గాంధీ ప్రేమ వివాహం చేసుకున్నారు. రాజీవ్గాంధీ హత్యానంతరం ఆమె సమర్థంగా పార్టీని నడిపిస్తున్నారు.