Union Minister Smriti Irani | కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ శుక్రవారం చేసిన వ్యాఖ్య వివాదాస్పదమైంది. ఒక మహిళా సభ్యురాలిని ఉద్దేశించి లేడీ అని సంబోధించడంపై కాంగ్రెస్ పార్టీ నేత అధిర్ రంజన్ చౌదరి, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు సౌగతా రాయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు వంగ విశ్వనాథ్ గీతను ఉద్దేశించి మంత్రి స్మృతి ఇరానీ.. లేడీ మెంబర్ అని సంబోధించారు.
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.. తన సహచర సభ్యురాలిని గౌరవనీయ సభ్యురాలు అని సంబోధించాలని అధిర్ రంజన్ చౌదరి, సౌగతారాయ్ సూచించారు. దీనిపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందిస్తూ తానేం మాట్లాడినా అన్పార్లమెంటరీ భాష వినియోగించలేదన్నారు. మహిళా సభ్యురాలిని ఉద్దేశించి లేడీ అని సంబోధించడం తప్పేమీ కాదన్నారు.
సభలోనే ఉన్న సభ్యురాలిని తానేమీ అగౌరవ పర్చలేదని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చెప్పారు. కేంద్ర మంత్రికి మద్దతుగా బిజూ జనతాదళ్ (బీజేడీ) సభ్యులు అనుభవ్ మొహంతి నిలిచారు. స్మృతి ఇరానీ ఎటువంటి అన్పార్లమెంటరీ భాష గానీ, అవమానకరమైన, తప్పు పదం వాడలేదని చెప్పారు.