న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీపై దట్టంగా పొగమంచు కమ్మింది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ అంతటా పొగమంచు పరుచుకుంది. దాంతో ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 201కి పడిపోయింది. AQI 201కి పడిపోవడం అంటే గాలి నాణ్యత అత్యంత అధ్వాన్నంగా ఉన్నదని అర్థమని సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రిసెర్చ్ (SAFAR) వెల్లడించింది.
పూసా రోడ్ ఏరియాలో మరీ దారుణంగా AQI 376 గా నమోదైందని ఢిల్లీ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి పొగమంచు దట్టంగా ఉండటంతో ఢిల్లీలోని ఇంధిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పొగమంచు కారణంగా ఇవాళ ఉదయం నుంచి విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని, ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడినప్పటికీ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని ఢిల్లీ ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.
ప్రయాణికులకు జరిగిన అసౌకర్యానికి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించారు. అటు స్పైజ్ జెట్, ఇండిగో, విస్తారా లాంటి దేశీయ విమానయాన సంస్థలు కూడా ప్రయాణికులకు క్షమాపణలు చెప్పాయి. జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ప్రకటించాయి.