ముంబై: ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న నూతన సాంకేతికతల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఒకటి. ఈ టెక్నాలజీలో భారత్ కీలక పాత్ర పోషించేందుకు దోహదపడేలా ‘హనుమాన్’ పేరుతో సీతా మహలక్ష్మి హెల్త్కేర్ (ఎస్ఎంఎల్) సంస్థ ఓ లార్జ్ లాంగ్వేజ్ మాడల్ (ఎల్ఎల్ఎం)ను ఆవిష్కరించింది. ఏకంగా 22 భారతీయ భాషల్లో ఆరోగ్య సంరక్షణ, పరిపాలన, విద్య, ఆర్థిక సేవలు తదితర రంగాలకు సంబంధించిన సేవలను అందించగలిగే ఈ ఎల్ఎల్ఎంను బాంబే ఐఐటీ నేతృత్వంలోని భారత్ జీపీటీ ఎకోసిస్టం భాగస్వామ్యంతో ఆవిష్కరించారు. బాంబే ఐఐటీతోపాటు మరో 7 ఇతర ఐఐటీల ఆధ్వర్యంలో పనిచేస్తున్న భారత్ జీపీటీ ఎకోసిస్టం వాస్తవానికి ఓ రిసెర్చ్ కన్సార్షియం. ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్తోపాటు కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం, ఎస్ఎంఎల్ తోడ్పాటుతో ముందుకు సాగుతున్న ఈ కన్సార్షియం.. చాట్ జీపీటీ తరహాలో సేవలందించే భారత్ జీపీటీని వచ్చే నెలలో ప్రారంభించనున్నది. స్పీచ్-టు-టెక్స్, టెక్స్-టు-స్పీచ్, టెక్స్-టు-వీడియో, వీడియో-టు-టెక్స్ జనరేటింగ్ లాంటి బహుళ సామర్థ్యాలను కలిగి ఉన్న ‘హనుమాన్’ ఎల్ఎల్ఎం ప్రస్తుతానికి హిందీ, తమిళ్, తెలుగు, మళయాళం, మరాఠీ తదితర 11 భారతీయ భాషల్లో ప్రతిస్పందిస్తున్నది. మున్ముందు 22 భారతీయ భాషల్లో ప్రతిస్పందించగలిగేలా సామర్థ్యాన్ని పెంచాలని భావిస్తున్నారు.