ఐఐటీ మండి పరిశోధకుల అభివృద్ధి
న్యూఢిల్లీ, ఆగస్టు 16: ట్రాఫిక్ నియంత్రణలో మానవ ప్రమేయాన్ని తగ్గించడానికి, మలుపుల వద్ద ప్రమాదాలను నిరోధించడానికి ఐఐటీ మండి పరిశోధకులు ఓ సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేశారు. దీనిని స్మార్ట్ రోడ్ మానిటరింగ్ సిస్టమ్ అని పిలుస్తున్నారు. ఇది మైక్రో ఎలక్ట్రోమెకానికల్ సిస్టమ్స్(మెమ్స్), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారంగా పనిచేస్తుంది. ఈ వ్యవస్థలో రెండు లేయర్ల డిటెక్షన్ యూనిట్లు, రెండు సిగ్నలింగ్ యూనిట్లు ఉంటాయి. వీటిని రోడ్డు మలుపుల్లో చెరోవైపు ఏర్పాటు చేస్తారు. ఏదైనా వాహనం మూల మలుపు దగ్గరకు వచ్చినప్పుడు డిటెక్షన్ యూనిట్.. వాహనం వేగం, దిశ, అది టూ వీలరా, కారా తదితర విషయాలను గమనిస్తుంది. అదే సమయంలో మరో వైపు నుంచి వాహనం వస్తే అటువైపు ఉన్న సిగ్నలింగ్ వ్యవస్థ యాక్టివేట్ అయి డ్రైవర్లను అప్రమత్తం చేస్తుంది. ఏ రకమైన వాహనం వస్తుంది.. ఎంత వేగంతో వస్తుందన్న అంశాలను బట్టి సిగ్నల్స్లో మార్పులు ఉంటాయి. ఫలితంగా డ్రైవర్ నెమ్మదిగా వెళ్లడమో, సైడ్ తీసుకోవడమో చేస్తారు. ప్రమాదాలు జరగవు. ఈ టెక్నాలజీపై ఐఐటీ మండి పరిశోధకులు ఇప్పటికే పేటెంట్ పొందారు.