జైపూర్: రాజస్థాన్లో అతి చిన్న పోలింగ్ బూత్ను ఎన్నికల సంఘం (ఈసీ) ఏర్పాటు చేసింది. (Smallest Polling Booth) ఒకే కుటుంబానికి చెందిన 35 మంది ఉన్న ఆ మూరుమూల గ్రామంలో ఈ మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. పాకిస్థాన్, భారత్ సరిహద్దు ప్రాంతమైన బార్మర్ జిల్లాలోని బాద్మేర్ కా పార్లో ఒకే ఒక కుటుంబం నివసిస్తున్నది. 35 మంది కుటుంబ సభ్యులే ఆ గ్రామ జనాభా. వీరిలో 18 మంది పురుషులు కాగా 17 మంది మహిళలు. ప్రతి ఎన్నికలప్పుడు ఓటు వేసేందుకు సుమారు 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వచ్చేంది. దీంతో కేవలం మగవారు మాత్రమే అతి కష్టం మీద కాలి నడకన లేదా ఒంటెలపై ఆ పోలింగ్ బూత్కు వెళ్లి ఓటు వేసేవారు. మహిళలు, వృద్ధులు ఓటు హక్కు వినియోగించుకునేవారు కాదు.
కాగా, ఈసారి బాద్మేర్ కా పార్ గ్రామస్తుల కష్టాలు తీరనున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన 35 మంది ఓటర్ల కోసం ఈ గ్రామంలో ప్రత్యేకంగా పోలింగ్ బూత్ను ఈసీ ఏర్పాటు చేసింది. దీంతో గ్రామంలోని 35 మందితో కూడిన ఒకే ఒక కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. ఈసారి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మగవారితోపాటు మహిళలు, వృద్ధులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.