Tomato | పుణె: దేశంలో అనూహ్యంగా పెరిగిపోయిన టమాట ధరలు సామాన్యుడి జేబును గుల్ల చేస్తుండగా కొందరు రైతులను కోటీశ్వరులను చేస్తున్నది. మహారాష్ట్రలోని పుణె జిల్లాకు చెందిన ఒక రైతు నెల రోజుల వ్యవధిలో టమాటాల అమ్మకం ద్వారా కోటీశ్వరుడైపోయాడు. పచ్గర్ జిల్లాకు చెందిన ఈశ్వర్ గేకర్ (36) అనే రైతు జూన్ 11 నుంచి జూలై 18 వరకు మూడు కోట్ల రూపాయలను టమాటాల విక్రయం ద్వారా ఆర్జించాడు.
పొలంలో ఇంకా కొంత పంట కోయాల్సి ఉందని, అది అమ్మితే మరో 50 లక్షల రూపాయల ఆదాయం వస్తుందని తెలిపాడు. తాను మొత్తం 18 వేల బాక్స్లు (ఒక్కో బాక్స్లో 20 కేజీలు) టమాటాను 700 నుంచి 2200 రూపాయల వరకు అమ్మినట్టు చెప్పాడు. 12 ఎకరాల పొలంలో పండించిన ఈ టమాటా సాగుకు మొత్తం 40 లక్షల వ్యయం అయ్యిందని తెలిపాడు. టమాట సాగులో తాను ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని, ఈ ఏడాది మేలోనే అతి తక్కువ ధర పలకడంతో రవాణా ఖర్చులు కూడా రాక పెద్దమొత్తంలో టమాటాలను పారబోసినట్టు తెలిపాడు. ఆ నెలలో టమాటాల బాక్స్ ధర 50 రూపాయలు (కేజీ రూ.2.50) మాత్రమే పలికిందని, అలాగే 2021లో ఈ పంట ద్వారా రూ.15, 16 లక్షల నష్టం వాటిల్లిందన్నారు. ఈసారి లక్ష్మీకటాక్షం లభించిందని సంతోషం వ్యక్తం చేశాడు.