అహ్మదాబాద్: ఎమ్మెల్యేగా ఆరుసార్లు గెలిచిన నేత ప్రస్తుతం బీజేపీ రెబల్గా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. వాఘోడియా నియోజకవర్గం సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే మధుభాయ్ శ్రీవాస్తవ్కు ఆ పార్టీ టికెట్ నిరాకరించింది. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయన నిర్ణయించారు. నాడు గుజరాత్ బీజేపీ నేతలైన మోదీ, అమిత్ షా కోరడంతోనే 1995లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన తాను ఆ పార్టీలో చేరినట్లు శ్రీవాస్తవ్ తెలిపారు. అనంతరం బీజేపీ తరుఫున ఐదుసార్లు పోటీ చేసి గెలిచిన తనకు ఈసారి టికెట్ ఇవ్వలేదని విమర్శించారు. తన స్థానంలో టికెట్ పొందిన వడోదర జిల్లా బీజేపీ చీఫ్ అశ్విన్ పటేల్, స్థానిక ఎన్నికల్లో ఎన్నడూ గెలవలేదని ఆయన ఆరోపించారు. తనకు టికెట్ నిరాకరణపై బీజేపీపై తాను చాలా కోపంగా ఉన్నానని, ఆ పార్టీలో అన్ని పదవులను వదులుకున్నట్లు మీడియాతో అన్నారు.
కాగా, తాను సొంతంగా బీజేపీలో చేరలేదని రెబల్గా మారిన ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే మధుభాయ్ శ్రీవాస్తవ్ తెలిపారు. 1995లో తాను భారీ మెజార్టీతో స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలువడంతో నరేంద్ర మోదీ, అమిత్ షా తన వద్దకు వచ్చి బీజేపీలో చేరమని కోరారని చెప్పారు. అందుకే తాను బీజేపీలో చేరినట్లు వెల్లడించారు. మోదీ, అమిత్ షాతో నేరుగా మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ తనకు టికెట్ నిరాకరించినందుకు వారితో మాట్లాడబోనని అన్నారు.
మరోవైపు గుజరాత్లోని మొత్తం 282 అసెంబ్లీ సీట్లకు గాను 160 మంది అభ్యర్థులతో తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. అయితే ఐదుగురు మంత్రులు, అసెంబ్లీ స్పీకర్తో సహా 38 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి టికెట్ కేటాయించలేదు. ఈ నేపథ్యంతో ఇటీవల జరిగిన హిమాచల్ప్రదేశ్ ఎన్నికల్లో మాదిరిగానే గుజరాత్లో కూడా పెద్ద సంఖ్యలో రెబల్ అభ్యర్థులు పోటీ చేయవచ్చని తెలుస్తున్నది.