ముంబై: ఆరు పులులు కలిసి నడిచిన అరుదైన దృశ్యం కెమెరాకు చిక్కింది. మహారాష్ట్రలోని నాగ్పూర్ సమీపంలోని ఉమ్రేద్ కర్హండ్ల వన్యప్రాణుల అభయారణ్యంలో ఈ ఘటన జరిగింది. ఈ వీడియోలో ఆరు పులులు అటవీ మార్గంలో కలిసి నడుస్తాయి. కొన్ని సెకండ్ల తరువాత వెనుక నుండి ఒక వాహనం పులుల వద్దకు రావడం కనిపిస్తుంది. ఆ వాహనాన్ని గుర్తించిన ఒక పులి అడవిలోకి పారిపోతుంది. మిగతా ఐదు పులులు మాత్రం అటవీ మార్గంలో నడకను కొనసాగిస్తాయి. టైగర్ సఫారీ సందర్భంగా ఈ వీడియో తీసినట్లుగా తెలుస్తున్నది.
నటుడు రణదీప్ హుడా తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో తన వాట్సాప్కు వచ్చినట్లు ఆయన తెలిపారు. కాగా, పులులు చిన్నప్పుడు మాత్రమే తల్లి వద్ద గుంపుగా కలిసి ఉంటాయని, పెద్ద అయిన తర్వాత ఇలా కలిసి ఉండటం చాలా అరుదని ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (ఐఎఫ్ఎస్) అధికారి రమేష్ పాండే తెలిపారు.