Road Accident : వివాహ వేడుకలకు వెళ్లి తిరిగి వస్తున్న ఓ మీనీ బస్సు (Mini Bus) ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 12 మందిలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బస్సు డ్రైవర్ సహా మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) రాష్ట్రం హాపూర్ జిల్లా (Hapur district) లో దౌలానా-గులవాటి (Dhaulana-Gulavati) రహదారిపై సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. పెళ్లి వేడుకకు వెళ్లిన మినీ బస్సు వేడుక అనంతరం 12 మందితో తిరుగు పయనం అయ్యింది. మార్గమధ్యలో దౌలానా-గులవాటి రోడ్డుపై ఎదురుగా వచ్చిన లారీ.. బస్సును ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు పోలీసులు వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడిన ఏడుగురిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మరణించిన ఆరుగురి మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు.
కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించామని చెప్పారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అన్నారు.