న్యూఢిల్లీ: పార్లమెంట్లో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ ప్రతిపక్షాల ఆందోళనల నడుమ కేంద్రం పలు బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. వీటిలో జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టం సంబంధిత బిల్లు కూడా ఉంది. కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. మరో ఐదు బిల్లులను కూడా సభలో ప్రవేశపెట్టారు. షెడ్యూల్డ్ కులాల (జమ్ముకశ్మీర్) సవరణ చట్టం, షెడ్యూల్డ్ గిరిజనుల (జమ్ముకశ్మీర్) చట్టాలను కేంద్ర మంత్రులు వీరేంద్ర కుమార్, అర్జున్ ముండా ప్రవేశపెట్టారు. మరోవైపు గనులు, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) సవరణ చట్టాన్ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రవేశపెట్టారు. ప్రైవేటు సెక్టార్ కంపెనీలకు గనుల లోతైన అన్వేషణకు అనుమతులిచ్చే ఈ బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. దీనిపై రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీకి చెందిన సభ్యుడు ఎన్కే ప్రేమచంద్రన్ మాట్లాడుతూ ఫెడరలిజం స్ఫూర్తికి ఇది వ్యతిరేకంగా ఉందని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల భద్రతతో పాటు దేశ భద్రతకు ఈ బిల్లు భంగం కలిగిస్తుందన్నారు.
పరిరక్షణ చట్టాల నుంచి మినహాయింపు
అటవీ సంరక్షణ బిల్లును లోక్సభ ఆమోదించింది. దేశ సరిహద్దుకు 100 కి.మీ పరిధిలోని భూ భాగాన్ని అటవీ పరిరక్షణ చట్టాల నుంచి మినహాయించాలని ఈ బిల్లులో పొందుపరిచారు. అటవీ ప్రాంతాల్లో జంతు ప్రదర్శన శాలలు, సఫారీలు, పర్యాటక వసతుల ఏర్పాటుకు అనమతులిచ్చేందుకు ఈ బిల్లు కేంద్రానికి సౌలభ్యం కల్పిస్తుంది.