Manish Sisodia | న్యూఢిల్లీ, మార్చి 10: ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియాను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు 7 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. 10 రోజుల కస్టడీకి ఇవ్వాలన్న ఈడీ వాదనను న్యాయస్థానం ఈ సందర్భంగా తోసిపుచ్చింది. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీపై తీహార్ జైల్లో ఉన్న మనీశ్ సిసోడియాను ఈడీ అధికారులు మనీలాండరింగ్ కేసులో గురువారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సీబీఐ కేసులో ఆయన పెట్టుకొన్న బెయిల్ పిటిషన్ శుక్రవారం విచారణకు రానున్న ఒక్కరోజు ముందుగా ఈడీ అరెస్టు చేయడం గమనార్హం. కస్టడీపై వాదనల సందర్భంగా దర్యాప్తు సంస్థల వ్యవహారశైలిని సిసోడియా తీవ్రంగా ఆక్షేపించారు. దర్యాప్తు సంస్థలు అరెస్టులు చేయడం తమ హక్కుగా భావిస్తున్నాయని, ఈ రోజుల్లో ఇది ఫ్యాషన్గా మారిపోయిందని తన న్యాయవాది ద్వారా తెలిపారు. మరోవైపు సీబీఐ కేసులో సిసోడియా పెట్టుకొన్న బెయిల్ దరఖాస్తుపై విచారణను కోర్టు ఈ నెల 21కి వాయిదా వేసింది.
ఈడీ వాదనను సిసోడియా న్యాయవాది వ్యతిరేకించారు. దర్యాప్తు సంస్థలు అరెస్టులు చేయడం హక్కుగా భావిస్తున్నాయని, ఫ్యాషన్గా మారిందని మండిపడ్డారు. ఇటువంటి అరెస్టుల పట్ల కోర్టులు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. సిసోడియా వద్ద ఒక్క అక్రమ పైసాను కూడా ఈడీ గుర్తించలేదని, అందుకే సిసోడియా తరపున ఇతరులు పనిచేశారంటూ వాదనలు చేయడం నవ్వు తెప్పిస్తున్నదన్నారు.
సిసోడియాను ఈడీ అరెస్టు చేయడంపై ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ స్పందించారు. కొంతమంది తమను తాము దేవుళ్లు అనుకొంటున్నారని కేంద్ర ప్రభుత్వ పెద్దలను ఉద్దేశించి అన్నారు. ‘హిరణ్య కశిపుడు కూడా తనకు తాను దేవుడు అనుకొనేవాడు. నేటి కాలంలో కూడా కొంతమంది ఇదేవిధంగా అనుకొంటున్నారు’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇదే సమయంలో మనీశ్ సిసోడియా అరెస్టును, విష్ణుమూర్తి భక్తుడైన ప్రహ్లాదుడికి తండ్రి హిరణ్య కశిపుడి వలన ఎదురైన కష్టాల మధ్య కూడా పోలిక తెచ్చారు. ‘ దేశానికి, పిల్లలకు సేవచేసిన ప్రహ్లాదుడిని జైల్లో పెట్టారు. కానీ అప్పుడు ప్రహ్లాదుడిని ఆపలేకపోయారు. ఇప్పుడు కూడా అడ్డుకోలేరు’ అంటూ కేజ్రీవాల్ ట్విట్టర్లో పోస్టు చేశారు.
ఢిల్లీ మద్యం కేసులో సిసోడియా తర్వాత అరెస్టు అయ్యేది కేజ్రీవాలేనని కాన్మ్యాన్ సుకేశ్ చంద్రశేఖర్ను శుక్రవారం పటియాలా హౌస్ కోర్టు వద్ద వ్యాఖ్యానించారు. అటు.. పశ్చిమ బెంగాల్ టీచర్ల నియామక కుంభకోణంలో ఈడీ టీఎంసీ నేత శంతను బెనర్జీని శుక్రవారం అరెస్టు చేసింది.