FATF New Chief | అంతర్జాతీయంగా హవాలా లావాదేవీల నిరోధక సంస్థ.. ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) అధ్యక్షుడిగా సింగపూర్కు చెందిన టీ రాజా కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం `ఎఫ్ఏటీఎఫ్` చీఫ్గా ఉన్న మార్కస్ ప్లెయర్ స్థానంలో టీ రాజా కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. వచ్చే రెండేండ్ల పాటు ఆయన ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు.
ఎఫ్ఏటీఎఫ్ అధ్యక్షుడిగా రాజా కుమార్ సేవలు ఈ రోజుతో మొదలవుతుంది. అంతర్జాతీయంగా ఉగ్రవాదులకు నిధులు, హవాలా లావాదేవీల నిరోధక సంస్థగా ఎఫ్ఏటీఎఫ్ పనితీరును మరింత సమర్థవంతం చేయడంపై దృష్టి సారిస్తారు. అసెట్స్ రికవరీ తదితర అంశాలపై దృష్టి సారిస్తారు` అని ఎఫ్ఏటీఎఫ్ శుక్రవారం ట్వీట్ చేసింది.
అంతర్జాతీయంగా ఉగ్రవాదులకు నిధుల సాయాన్ని నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘ కాలంగా రాజా కుమార్ కృషి చేస్తున్నారు. ఎఫ్ఏటీఎఫ్ అధిపతిగా బాధ్యతలు చేపట్టగానే సంస్థ ప్లీనరీ సమావేశాల్లో తన లక్ష్యాలను వివరించారు. సింగపూర్ నేషనల్ యూనివర్సిటీలో ఎల్ఎల్బీ (హానర్స్) డిగ్రీ, కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఫిలాసఫీ (క్రిమినాలజీ అండ్ లా)లో పీజీ పట్టా పుచ్చుకున్నారు.