లక్నో: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ మౌన దీక్ష చేపట్టారు. లఖింపూర్ ఖేరీ ఘటన నిందితులను అరెస్ట్ చేసే వరకు తన దీక్షను విరమించబోమనని ఆయన చెప్పారు. లఖింపూర్ ఖేరీలో ఆదివారం నిరసన చేస్తున్న రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడి వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనతో పాటు అనంతరం జరిగిన ఆందోళనలో 8 మంది చనిపోయారు. మృతుల్లో నలుగురు రైతులు, ఒక జర్నలిస్ట్, మరో ముగ్గురు ఉన్నారు.
ఈ నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా పంజాబ్లోని మొహాలీ నుంచి ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీకి గురువారం చేపట్టిన భారీ కాంగ్రెస్ ర్యాలీకి సిద్ధూ నేతృత్వం వహించారు. పలు వాహనాల్లో వచ్చిన పంజాబ్ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు, కార్యకర్తలను యూపీ పోలీసులు సరిహద్దులో అడ్డుకున్నారు. సిద్ధూను అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా సిద్ధూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. శుక్రవారంలోగా నిందితులను అరెస్ట్ చేయకపోతే నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. దీంతో చివరకు ఆయనను మాత్రమే లఖింపూర్ ఖేరీకి అనుమతిస్తామని పోలీసులు చెప్పారు.
దీంతో లఖింపూర్ ఖేరీ ఘటనలో మరణించిన జర్నలిస్ట్ రామన్ కశ్యప్ కుటుంబం ఉండే నిగసస్కు సిద్ధూ చేరుకున్నారు. ఆ జర్నలిస్ట్ కుటుంబాన్ని పరామర్శించిన ఆయన ఆ ఇంటి వద్ద శుక్రవారం సాయంత్రం మౌన దీక్షకు దిగారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేసే వరకు మౌన దీక్షను కొనసాగిస్తానని సిద్ధూ తెలిపారు.