Karnataka | బెంగళూరు, నవంబర్ 22: కులగణన విషయంలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం నిలువునా చీలింది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. తన గత టర్మ్లో నిర్వహించిన వివాదాస్పద కులగణన నివేదికను ఆమోదించి అమలు చేసేందుకు సీఎం సిద్ధరామయ్య సిద్ధమవుతుండగా.. దాన్ని వ్యతిరేకిస్తూ, అమలును నిలిపివేయాలని కోరుతూ ఇటీవల సీఎంకు సమర్పించిన ఓ మెమోరాండంపై వొక్కలిగ కమ్యూనిటీకి చెందిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తోపాటు మరో మంత్రి ఎంసీ సుధాకర్ సంతకాలు చేశారు. ఈ విషయాన్ని డీకే శివకుమారే తాజాగా స్వయంగా వెల్లడించారు.
కే బుధవారం మీడియాతో మాట్లాడుతూ కులగణనపై తాను పార్టీ స్టాండ్లోనే ఉన్నానని చెబుతూనే, కులగణనను శాస్త్రీయ పద్ధతిలో చేపట్టాలని పలు కులాల డిమాండ్ను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. అణగారిన వర్గాలకు న్యాయం చేసేందుకు కులగణనను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నానని సీఎం సిద్ధరామయ్య మంగళవారమే తన ఎక్స్ పోస్టులో చెప్పుకొచ్చిన తర్వాతనే.. డీకే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. వొక్కలిక సంఘం సమర్పించిన మోమరాండంపై సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ.. ‘నివేదిక ఇవ్వకముందే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు. కొంతమంది అయితే కనీసం నివేదిక చూడకుండా వ్యతిరేస్తున్నారు. అసలు నివేదిక రానివ్వండి. దానిపై క్యాబినెట్లో చర్చిస్తాం’ అని పేర్కొన్నారు. ఈ తాజా పరిణామాలు రాష్ట్ర కాంగ్రెస్లో కుమ్ములాటలను మరింత తీవ్రం చేసే అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
2015లో సిద్ధరామయ్య సీఎంగా ఉన్న సమయంలో కులగణన చేపట్టారు. దీన్ని రాష్ట్రంలో ఆధిపత్య కులాలుగా ఉన్న లింగాయత్లు, వొక్కలిగలు బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. కులగణనపై ప్రభుత్వానికి ఈ నెల 24న ‘సామాజిక, ఆర్థిక, అకడమిక్ సర్వే’పై నివేదిక సమర్పించే యోచనలో ఉన్నామని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ కే జయప్రకాశ్ హెగ్డే ఇదివరకే వెల్లడించారు. నివేదికను తిరస్కరించాలని డిమాండ్ చేస్తూ వొక్కలిగ, లింగాయత్ కమ్యూనిటీలు ఆందోళనలు ప్రారంభించాయి. ఈ మేరకు వొక్కలిగ సంఘం ఈ నెల 15న సీఎం సిద్ధరామయ్యకు మెమోరాండం సమర్పించింది. దీనిపై డిప్యూటీ సీఎం డీకే, మరో మంత్రి సుధాకర్లతో సహా జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ, మాజీ సీఎంలు ఎస్ఎం కృష్ణ, సదానంద గౌడ, జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే, ప్రతిపక్ష నేత ఆర్ అశోక తదితర నేతలు సంతకాలు చేశారు.
వొక్కలిగ సంఘం మెమోరాండంపై సంతకం పెట్టడాన్ని డీకే సమర్థించుకొన్నారు. ‘సర్వే సరిగ్గా జరుగలేదని ఎమ్మెల్యేలు, కమ్యూనిటీ నేతలు భావిస్తున్నారు. కులగణనను శాస్త్రీయంగా చేపట్టాలి’ అని పేర్కొన్నారు. ఎస్సీలు, ఎస్టీలు, పంచమశాలీలు, వీరశైవులు వంటి అనేక కులాలు దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతున్నాయని, ఆందోళనలు చేస్తున్నాయని, అదేవిధంగా వొక్కలిగలు కూడా చేస్తున్నారని శివకుమార్ అన్నారు. కులగణనకు ముందు తమను సంప్రదించలేదని కొన్ని కులాలు చెబుతున్నాయని, అందుకే వారు శాస్త్రీయ కులగణన డిమాండ్ చేస్తున్నారన్నారు.
మరోవైపు కర్ణాటకలో కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు మరింత ముదురుతున్నాయి. కరెంట్, నీటి సంక్షోభంతో పాటు ఇతర సమస్యలతో నానా ఇబ్బందులు పడుతున్న ప్రజలను, వారి సంక్షేమాన్ని వదిలేసి.. పదవులే ముఖ్యం అన్నట్టుగా నేతలు కొట్టుకొంటున్నారు. దీంతో రాష్ట్రంలోని పలు ప్రభుత్వ బోర్డులు, కార్పొరేషన్లలోని పదవుల నియామకాలు వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. పదవుల పంపిణీపై రాష్ట్ర నేతల మధ్య సయోధ్య కుదరక ఢిల్లీ అధిష్ఠానం ఇక్కడకు తన దూతలను పంపింది. అయినా ఈ పంచాయితీ తెగలేదు. ప్రభుత్వ బోర్డులు, కార్పొరేషన్ల పదవుల నియామకాలపై తుది నిర్ణయం తీసుకోనేందుకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కర్ణాటక కాంగ్రెస్ ఇన్చార్జి రణదీప్ సింగ్ సుర్జేవాలా మంగళవారం బెంగళూరులో నిర్వహించిన సమావేశం అసమగ్రంగా, అసంపూర్తిగా ముగిసింది. నియామకాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. దీంతో పదవుల పందేరం మరోసారి వాయిదా పడింది. ఈ వ్యవహారం ప్రభుత్వం, పార్టీలోని పెద్దల మధ్య విభేదాలు ముఖ్యంగా సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య అంతర్గత కుమ్ములాటలను బహిర్గతం చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు పోస్టుల పంపిణీ ప్రక్రియపై రాష్ట్ర హోమంత్రి జీ పరమేశ్వర్ అసంతృప్తితో ఉన్నారని వార్తలు వస్తున్నాయి.