న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్ హత్య కేసు దర్యాప్తులో మరో కీలక ముందడుగు పడింది. ఢిల్లీలోని మెహ్రౌలీ అటవీ ప్రాంతం నుంచి స్వాధీనం చేసుకున్న ఎముకలు, వెంట్రుకలు శ్రద్ధావాకర్వేనని నిర్ధారణ అయ్యింది. శ్రద్ధావాకర్ మృతదేహాన్ని 35 ముక్కలు చేసి వేర్వేరు ప్రాంతాల్లో పారేయడం, అవి పూర్తిగా కుళ్లిపోయి ఎముకలు మాత్రమే లభ్యంకావడంతో ఆమె బాడీ పార్ట్స్ నుంచి శాంపిల్స్ సేకరించేందుకు పోలీసులకు వీలుకాలేదు.
దాంతో శ్రద్ధావాకర్విగా అనుమానించిన ఎముకలు, వెంట్రుకలను మైటోకాండ్రియల్ డీఎన్ఏ పరీక్షల కోసం హైదరాబాద్లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ డయాగ్నస్టిక్కు పంపించారు. ఆ శాంపిల్స్లోని డీఎన్ఏ, శ్రద్ధా వాకర్ తల్లిదండ్రుల డీఎన్ఏతో సరిపోలింది. దాంతో ఈ కేసు దర్యాప్తు మరింత వేగవంతం అయ్యేందుకు అవకాశం దక్కింది.
శ్రద్ధావాకర్ను ఆమెతో సహజీనం చేస్తున్న ఆఫ్తాబ్ అమీన్ అత్యంత దారుణంగా హతమార్చాడు. ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా చేసి ఫ్రిజ్లో పెట్టుకుని ఒక్కొక్కటిగా సమీప అటవీ ప్రాంతంలో హైవే వెంబడి పారవేశాడు. దేశ రాజధాని ఢిల్లీలోని మెహ్రౌలీ ఏరియాలో గత ఏడాది మే, జూన్ నెలల్లో జరిగిన ఈ హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.