న్యూఢిల్లీ: ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా.. తనకు చదువుకోవడానికి నవలలు, ఇతర సాహిత్య పుస్తకాలు సమకూర్చాలని తీహార్ జైలు అధికారులను కోరాడు. దాంతో జైలు అధికారులు త్వరలోనే అతనికి సాహిత్య పుస్తకాలు సమకూర్చనున్నట్లు తెలిపారు. తీహార్ జైలులోని విశ్వసనీయ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.
ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా తనతో సహజీవనం చేసిన శ్రద్ధా వాకర్ అనే యువతిని దారుణంగా హత్యచేశాడు. అనంతరం అమె మృతదేహాన్ని 35 ముక్కలు చేసి రిఫ్రిజిరేటర్లో దాచాడు. పోలీసులకు చిక్కకుండా వాటిని ఒక్కొక్కటిగా పారవేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో హత్య అనంతరం ఆరు నెలలకు విషయం బయటపడింది. ఈ హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న నిందితుడిని ఇప్పటికే పలు విధాలుగా విచారించారు. శ్రద్ధను హత్య చేయడం తనకు ఏమాత్రం బాధ కలిగించడం లేదని పోలీసుల విచారణలో ఆఫ్తాబ్ వెల్లడించడం గమనార్హం. కాగా, నిందితుడికి అధికారులు పాలిగ్రాఫ్ టెస్టు, నార్కో ఎనాలిసిస్ టెస్టులు కూడా నిర్వహించారు. ఆఫ్తాబ్ సాధారణ విచారణలో చెప్పిన విషయాలు, పాలిగ్రాఫ్, నార్కో టెస్టుల సందర్భంగా వెల్లడించిన విషయాలు ఒకేలా ఉన్నాయని పోలీసులు తెలిపారు.