చెన్నై : తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని ఓ గ్రామంలో దారుణం వెలుగుచూసింది. అంటరానితనం పాటిస్తూ ఓ దుకాణదారుడు కెమెరాలో అడ్డంగా దొరికిపోయాడు. దళితులకు సరుకులు అమ్మవద్దని గ్రామస్తులు కోరడంతోనే తాను ఇలా చేశానని దుకాణాదారు పేర్కొన్నారు. ఓ వ్యక్తి పెట్రోల్ కావాలని షాపునకు రాగా ఓ వర్గానికి చెందిన వారికి విక్రయించవద్దని గ్రామస్తులు తనను కోరారని దుకాణాదారు చెబుతుండటం వీడియోలో కనిపించింది.
నవంబర్ 28న హిందువులు నిర్వహించిన పంచాయితీలో ఎస్సీలకు ఎలాంటి సరుకులు, వస్తువులు విక్రయించరాదని నిర్ణయించారని, వారికి ఎలాంటి ప్రోడక్ట్ అమ్మరాదని, దళితులను టీస్టాల్స్లోకి, బార్బర్ షాపుల్లోకి అనుమతించవద్దని గ్రామస్తులు నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఘటన తంజావూరు జిల్లా పాపకాడు సమీపంలోని కెలమంగళం గ్రామంలో జరిగింది. ఈ వ్యవహారాన్ని ఎస్సీ, ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లిన స్ధానిక ఎంపీ రవికుమార్ అంటరానితనం పాటిస్తున్న వారిపై కఠిన చర్యలు చేపట్టాలని కోరుతూ కమిషన్కు లేఖ రాశారు. దళితుల పట్ల వివక్ష పాటిస్తూ కెమెరాకు చిక్కిన షాపు యజమాని వీరముత్తును ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద పోలీసులు అరెస్ట్ చేశారు. వీరముత్తు దుకాణానికి సీల్ వేశారు.