ఏ వస్తువులు కొనేటప్పుడైనా ఏమైనా డిస్కౌంట్ ఉంటుందా? అని అడగడం కొందరికి అలవాటు. ఇలా డిస్కౌంట్ ఇస్తే సేల్స్ కూడా బాగుంటాయి. అందుకే చాలా వస్త్రాలు, ఆభరణాల షాపులు డిస్కౌంట్ సేల్స్ పెడుతుంటాయి. మరికొన్ని రోజుల్లో దసరా పండుగ ఉండటంతో ప్రముఖ ఆభరణాల సంస్థలు ఈ డిస్కౌంట్ సేల్స్పై ఫోకస్ పెట్టడం పరిపాటే. అయితే దేశ వాణిజ్య రాజధాని ముంబైలోని ఒక షాపు మాత్రం ఎలాంటి డిస్కౌంట్ ఇవ్వడం లేదు.
ఈ షాపులో ఆభరణాలు కొనేందుకు ఒక 52 ఏళ్ల వ్యక్తి వచ్చాడు. ఒక ఉంగరం కొందామని అనుకున్నాడు కానీ.. ఆ షాపు యజమాని దానిపై డిస్కౌంట్ ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో కోపం తెచ్చుకున్న కస్టమర్.. ఆ షాపులో రూ.1.24 కోట్ల విలువైన ఆభరణాలు కొట్టేశాడు. దొంగతనం చేసిన ఐదు రోజుల వరకు ఆ షాపు టెర్రస్ మీదనే ఉన్న ఆ కస్టమర్.. బంగారాన్ని కరిగించేందుకు కూడా ప్రయత్నాలు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల చేతికి దొరికిపోయిన నిందితుడు.. మరొక వ్యక్తి సాయంతో ఈ దొంగతనం చేసినట్లు వెల్లడించాడు. తను కొన్న ఉంగరంపై రూ.2 వేలు డిస్కౌంట్ ఇవ్వమంటే ఓనర్ నిరాకరించాడని, అందుకే 2.4 కేజీల బంగారం కొట్టేశామని అతను తెలిపాడు.