Zakir Naik : ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ ఎప్పుడూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా ఉంటూ వస్తున్నారు. తరచూ ఏవో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. తాజాగా మహిళల గురించి చాలా దారుణంగా మాట్లాడి మరో వివాదానికి తెరలేపారు. ఇంతకూ అతను మహిళల గురించి ఏమన్నారంటే.. ఒక మగాడికి వివాహమైనప్పటికీ మహిళలు అతడిని పెళ్లాడటం ఏమాత్రం తప్పు కాదనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు.
లేదంటే ఒకవేళ ఒక మహిళ పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోతే బజారు మనిషిలా మిగిలిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా మహిళలను కించపర్చేలా మాట్లాడి జకీర్ నాయక్ మరో వివాదానికి తెర తీశారు. గతంలో మనీ లాండరింగ్కు పాల్పడటంతోపాటు, ద్వేషపూరిత ప్రసంగాల ద్వారా తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాడనే ఆరోపణల నేపథ్యంలో జకీర్ నాయక్పై భారత ప్రభుత్వం చర్యలకు సిద్దమైంది.
దాంతో 2016లో అతను భారత దేశాన్ని విడిచిపెట్టి మలేషియాకు మకాం మార్చాడు. గత ఎనిమిదేళ్లుగా అతడు ఒక్కసారి కూడా భారత్లో అడుగుపెట్టలేదు. అయితే తీవ్ర అభియోగాల నేపథ్యంలో జకీర్ నాయక్ను భారత్కు రప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కాగా, జకీర్ నాయక్ ప్రస్తుతం పాకిస్థాన్ పర్యటనలో ఉన్నాడు. ఆ దేశంలోని కీలక నగరాలైన ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్ సహా పలు ఇతర ప్రాంతాల్లో అతను ఉపన్యాసాలు ఇవ్వనున్నాడు. ఈ క్రమంలోనే ఆయన చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇస్లాం మతం.. ఒక పురుషుడు ఒకరి కంటే ఎక్కువ మంది మహిళలను పెళ్లాడేందుకు అనుమతిస్తుంది. అంటే అప్పటికే పెళ్లయి భార్య వున్న పురుషుడు మరో మహిళను ఇష్టపడవచ్చు. పెళ్లాడి సంతానాన్ని కూడా పొందవచ్చు. ఇదే విషయాన్ని గుర్తుచేసిన ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ ఈ సాంప్రదాయం తప్పేమీ కాదనేలా కామెంట్ చేశారు. పెళ్లికాని స్త్రీకి సమాజంలో గౌరవం లేదని నాయక్ పేర్కొన్నారు.
పెళ్లి చేసుకోడానికి అబ్బాయి దొరకకపోతే ఆ అమ్మాయి ముదు రెండు దారులు వుంటాయని, ఒకటి పెళ్లిచేసుకోకుండా మిగిలిపోవడం, రెండోది పెళ్లయిన వ్యక్తిని వివాహం చేసుకోవడమని జకీర్ నాయక్ అన్నారు. అయితే ఇందులో పెళ్లి చేసుకోకుండా వుండిపోవడం కంటే పెళ్లయిన వ్యక్తికి భార్యగా వెళ్లడమే మంచిదని వ్యాఖ్యానించారు. అలాంటి పెళ్లితో ఆమెకు గౌరవం పెరుగుతుందని జాకీర్ నాయక్ అన్నారు.
పెళ్లి చేసుకోకుండా వుండిపోయేవాళ్లు ‘బజార్ ఔరత్’ (బజారు మహిళ) గా మిగిలిపోతారంటూ జకీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెళ్ళి కాని మహిళలు పబ్లిక్ ప్రాపర్టీగా అతడు పేర్కొన్నారు. రెండో పెళ్లో లేక మూడో పెళ్లో.. మొత్తానికి పురుషుడితో వుంటేనే మహిళకు గౌరవమని సంచలన వ్యాఖ్యలు చేశారు. గౌరవప్రదమైన స్త్రీలు పెళ్లి చేసుకోడానికే ఇష్టపడతారని అన్నారు.
అయితే మహిళల గురించి జకీర్ నాయక్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అతడిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యధిక శాతం నెటిజన్లు నాయక్ వ్యాఖ్యలు.. స్త్రీలపై ఆయనకున్న ద్వేషాన్ని తెలియజేస్తున్నాయని మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు మహిళల హక్కులకు హానికరమైనవని విమర్శించారు.