భోపాల్: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రికార్డు క్రియేట్ చేశారు. అత్యధిక సంవత్సరాల పాటు బీజేపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా నిలిచారు. గతంలో చత్తీస్ఘడ్ సీఎం రమణ్ సింగ్ పేరిట ఉన్న రికార్డును శివరాజ్ బ్రేక్ చేశారు. రమణ్ సింగ్ 15 ఏళ్ల 10 రోజుల పాటు సీఎంగా ఉన్నారు. అయితే గురువారం రోజున ఆ రికార్డును శివరాజ్ దాటేశారు. మధ్యప్రదేశ్ సీఎంగా శివరాజ్ 15 ఏళ్ల 11 రోజుల్ని పూర్తి చేసుకున్నారు. 2005 నవంబర్లో తొలిసారి మధ్యప్రదేశ్ సీఎంగా శివరాజ్ బాధ్యతలు చేపట్టారు. 2018 వరకు ఆయన పదవిలో కొనసాగారు. 2018 నుంచి 2020 వరకు కమల్నాథ్ సీఎంగా ఉన్నారు. అయితే 2020 మార్చిలో బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
అతి సుదీర్ఘ కాలం సీఎంగా బాధ్యతలు చేపట్టిన వారిలో సిక్కింకు చెందిన పవన్ కుమార్ చామ్లింగ్ ఉన్నారు. ఆయన 24 ఏళ్లు పాటు ఆ రాష్ట్ర సీఎంగా కొనసాగారు. ఇక ఆ తర్వాత జాబితాలో పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం జ్యోతి బసు ఉన్నారు. ఆయన 23 ఏళ్లు సీఎంగా చేశారు. అరుణాచల్ ప్రదేశ్కు చెందిన గీగాంగ్ అపాంగ్ 22 ఏళ్లు, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ 22 ఏళ్లుగా సీఎంగా ఉన్నారు.