ముంబై: ఛత్రపతి శివాజీ పాత ఐకాన్ అంటూ మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. శనివారం ఔరంగాబాద్లో బీజేపీ నేత నితిన్ గడ్కరీకి, ఎన్సీపీ అధినేత శరద్పవార్కు డీలిట్ పట్టాలను ప్రదానం చేస్తూ కోశ్యారీ ఈ వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. గవర్నర్ పదవి నుంచి కోశ్యారీని తొలగించాలని డిమాండ్ చేస్తూ ముంబై సహా రాష్ట్రంలోని పలు ఇతర ప్రాంతాల్లో సోమవారం శివసేన (యూబీటీ), కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులు, కార్యకర్తలు నిరసనలకు దిగారు. ఇటీవల శివాజీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేదీపైనా వారు ధ్వజమెత్తారు. కోశ్యారీని వెంటనే రాష్ట్రం నుంచి పంపేయాలని సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ డిమాండ్ చేశారు. కోశ్యారీ తీరుపై తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికీ శివాజీకి జరిగిన అవమానాన్ని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమర్ధించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నదని ఎన్సీపీ నాయకురాలు సుప్రియా సూలే మండిపడ్డారు. శివాజీ గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదని పేర్కొన్నారు. కోశ్యారీ, సుధాంశు త్రివేదిని వెంటనే పదవుల నుంచి తొలగించాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఉదయన్రాజే భోసలే డిమాండ్ చేశారు. బీజేపీ పెద్దలు నిర్ణయం తీసుకోకపోతే తనదారి తాను చూసుకొంటానని తేల్చిచెప్పారు. కాగా, ఈ ఉద్రిక్తతలను చల్లార్చేందుకు కేంద్రమంత్రి నితిన్గడ్కరీ రంగంలోకి దిగారు. శివాజీ మనందరి దేవుడని అన్నారు.