ముంబై : కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభంతో పాటు అంతర్గత విభేదాలు నెలకొనడం మహారాష్ట్రలో ఆ పార్టీ మిత్రపక్షం శివసేనలో గుబులురేపుతోంది. కాంగ్రెస్ వంటి పెద్ద పార్టీ సారధి లేకుండా నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడటంతో గందరగోళం నెలకొనడం సహజమని శివసేన నేత సంజయ్ రౌత్ అన్నారు. కాంగ్రెస్ త్వరలోనే తన అంతర్గత అంశాలను పరిష్కరించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
2019 లోక్సభ ఎన్నికల్లో పరాజయం అనంతరం కాంగ్రెస్ చీఫ్గా రాహుల్ గాంధీ వైదొలగిన అనంతరం ఆ పార్టీ నాయకత్వ సంక్షోభం ఎదుర్కొంటోంది. మరోవైపు వచ్చే ఏడాది ఆరంభంలో కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో పార్టీ అధికారంలో ఉన్న పలు రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభం, ముఖ్య నేతల మధ్య విభేధాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఇక జీ 23గా పేరొందిన సీనియర్ నేతల అసమ్మతి కూడా కాంగ్రెస్ పార్టీని కలవరపరుస్తోంది.