ముంబై : గుజరాతీలు, రాజస్ధానీలను ముంబై, థానేల నుంచి వెళ్లగొడితే మహారాష్ట్రకు డబ్బులుండవని రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆర్ధిక రాజధానిగా పేరొందిన ముంబై ఆ పేరును నిలబెట్టుకోలేదని గవర్నర్ వ్యాఖ్యానించారు. గవర్నర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన శివసేన మరాఠాలను అవమానించిన కోశ్యారి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.
కష్టించి పనిచేసే మరాఠాలను గవర్నర్ అవమానించారని, ఆయన తక్షణం క్షమాపణ చెప్పకుంటే ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తామని సేన ఎంపీ ప్రియాంక చతుర్వేది పేర్కొన్నారు. గవర్నర్ వ్యాఖ్యలను సీఎం, డిప్యూటీ సీఎం అంగీకరిస్తున్నారా..వారెందుకు మౌనంగా ఉన్నారని ఆమె నిలదీశారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా గవర్నర్ తీరును తప్పుపట్టారు. గవర్నర్ వ్యాఖ్యలను సీఎం షిండే ఖండించాలని ఎంపీ సంజయ్ డిమాండ్ చేశారు. బీజేపీ స్పాన్సర్ చేసిన సీఎం అధికారంలో ఉన్నారని, అందుకే మరాఠీలకు అవమానం జరుగుతోందని రౌత్ ఆరోపించారు.
గవర్నర్ వివరణ
గవర్నర్ కోశ్యారి తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. మరాఠీలను అవమానించే ఉద్దేశం తనకు లేదని, మహారాష్ట్ర అభివృద్ధిలో గుజరాతీలు, రాజస్దానీల పాత్ర గురించే తాను ప్రస్తావించానని చెప్పుకొచ్చారు. మరాఠీల కృషితోనే ఇప్పుడున్న మహారాష్ట్ర సాకారమైందని అన్నారు. మరాఠీల కృషి, దీక్షాదక్షతలను తాను ఏమాత్రం తక్కువ చేయలేదని స్పష్టం చేశారు.