న్యూఢిల్లీ : భారత్ లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ కు కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ (ఈసీ) బాధ్యత వహించాలని శివసేన ఆరోపించింది. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల నుంచి వైరస్ కేసులు ఇతర ప్రాంతాలకు వ్యాపించాయని పేర్కొంది. కేంద్రం రాజకీయాలను పక్కనపెట్టి మహమ్మారి కట్టడిపై కేంద్రీకరించాలని హితవు పలికింది. భారత్ లో మహమ్మారి వ్యాప్తికి చైనా కారణమైనా సెకండ్ వేవ్ కు మాత్రం కేంద్రం, ఈసీల తీరే కారణమని మండిపడింది. ఇటీవల ఎన్నికలు ముగిసిన ప్రస్తుతం పోలింగ్ జరుగుతున్న రాష్ట్రాల నుంచి వైరస్ 500 రెట్ల వేగంతో వ్యాప్తి చెందుతోందని పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయం పేర్కొంది.
రాజకీయ ప్రయోజనాల కోసం ఢిల్లీ పాలకులు వైరస్ వ్యాప్తి చేస్తున్నారని దుయ్యబట్టింది. దేశంలో పలు దవాఖానల్లో బెడ్లు, ఆక్సిజన్, వెంటిలేటర్ల కొరతతో పాటు రెమ్డిసివిర్ మందులు లభించని పరిస్థితి నెలకొంటే కేంద్ర ప్రభుత్వం బెంగాల్ ఎన్నికలతో బిజీగా ఉందని వ్యాఖ్యానించింది. బెంగాల్ ప్రచారంలో పాల్గొన్న కాషాయ పార్టీ నేతలు, కార్యకర్తలు కొవిడ్-19తో తిరిగివచ్చి తమ స్వస్ధలాల్లో వ్యాధిని వ్యాప్తి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.