కొన్ని రోజులుగా అధికార శివసేన, రాజ్ థాకరే నేతృత్వంలోని నవ నిర్మాణ సేన మధ్య తీవ్ర మాటల యుద్థం నడుస్తోంది. లౌడ్ స్పీకర్లను నిషేధించాలంటూ రాజ్ థాకరే ఉద్ధవ్ సర్కార్కు అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ గొడవపై దేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పక్షాలు స్పందించినా… వీరిద్దరి గొడవ మహారాష్ట్ర దాటి వెళ్లలేదు. ఇప్పుడు వీరిద్దరి గొడవ గడప దాటింది. అయోధ్యకు చేరింది.
అయోధ్య వేదికగా శివసేన, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన మధ్య పోస్టర్ వార్ నడుస్తోంది. పోస్టర్ల వేదికగా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలే చేసుకుంటున్నారు. దీంతో ఇప్పుడు వీరిద్దరి విమర్శలకు అయోధ్య వేదికైంది. తాను జూన్ 5న అయోధ్య సందర్శనకు వెళ్తున్నట్లు రాజ్ థాకరే ప్రకటించారు. ఇప్పుడు శివసేన యువనేత, మంత్రి ఆదిత్య థాకరే తాను కూడా అయోధ్య సందర్శనకు వెళ్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇద్దరి మధ్యా పోస్టర్ వార్ ప్రారంభమైంది.
ఇప్పుడు ఈ ఇద్దరూ ‘అస్లీ- నక్లీ’ అంటూ పోస్టర్ వార్ చేసుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం నవ నిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ థాకరేకి సంబంధించిన పోస్టర్లను అతికించారు. ”రాజ్ తిలక్ కీ కరో తయారీ… ఆ రహాహై భగ్వాధారీ…” (కాషాయధారి వస్తున్నాడు… రాజ తిలకం దిద్దడానికి తగిన ఏర్పాట్లు చేయండి) అంటూ పోస్టర్లు వెలిశాయి. ఇప్పుడు శివసేన దానికి కౌంటర్ ఇస్తోంది. ”అస్లీ ఆ రహాహై.. నక్లీ సే సావధాన్” (నిజమైన వాళ్లు వస్తున్నారు.. నకిలీతో తస్మాత్ జాగ్రత్త) అంటూ కౌంటర్ పోస్టర్లు వెలిశాయి. చివరికి.. అయోధ్య అధికారులు వీరికి సంబంధించిన పోస్టర్లను తొలగించేశారు.