ముంబై: మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ, శివసేన రెబల్ నేత, సీఎం ఏక్నాథ్ షిండే వర్గం మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. బీజేపీ నేతను షిండే వర్గం కార్యకర్తలు దారుణంగా కొట్టారు. మహారాష్ట్రలోని థానేలో ఈ సంఘటన జరిగింది. గురువారం వాగ్లే ఎస్టేట్లోని పరబ్వాడి వద్ద బ్యానర్ల ఏర్పాటుపై బీజేపీకి చెందిన ప్రశాంత్ జాదవ్, షిండే వర్గం కార్యకర్తల మధ్య వివాదం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు వచ్చి ఇరు వర్గాలకు సర్దిచెప్పారు.
కాగా, శుక్రవారం సాయంత్రం బీజేపీ నేత ప్రశాంత్ జాదవ్పై సుమారు 20 మంది షిండే వర్గం కార్యకర్తలు దాడి చేశారు. కర్రలతో దారుణంగా ఆయనను కొట్టారు. దీంతో ప్రశాంత్ జాదవ్ తలకు బలమైన గాయం అయ్యింది. షిండే వర్గానికి చెందిన స్థానిక మాజీ కార్పొరేటర్లు వికాస్ రేపాలే, నమ్రతా భోసాలే ఈ దాడికి కారణమని బీజేపీ ఆరోపించింది. ‘దోస్తీ కో దోస్తీ..మార్ కో మార్..లహు కో లహు సే జవాబ్ (స్నేహానికి స్నేహం… కొడితే తిరిగి కొట్టడం.. రక్తానికి రక్తం)’ అంటూ బీజేపీ మహిళా మోర్చా ట్వీట్ చేసింది.
మరోవైపు ఈ సంఘటనపై స్థానిక ఏసీపీని బీజేపీ ఎమ్మెల్యేలు నిరంజన్ దావ్ఖారే, సంజయ్ కేల్కర్ కలిశారు. పోలీసులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవడంలేదని వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో బీజేపీ, షిండే వర్గాల నుంచి పోలీసులపై ఒత్తిడి వస్తున్నట్లు తెలుస్తున్నది.
బీజేపీ నేత ప్రశాంత్ జాదవ్పై షిండే వర్గం కార్యకర్తల దాడికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఇరు వర్గాల మధ్య మరోమారు ఘర్షణ జరిగే అవకాశం ఉండటంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొన్నది.