ముంబై, డిసెంబర్ 16: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో అనూహ్య మలుపు. ‘షీనా బోరా చనిపోలేదు. బతికే ఉంది’ అని ఆమె తల్లి, హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఇంద్రాణీ ముఖర్జీ సీబీఐ డైరెక్టర్కు లేఖ రాశారు. కూతురిని వెతికి పెట్టాలని అభ్యర్థించారు. ఈ విషయాన్ని ఆమె తరఫు న్యాయవాది గురువారం వెల్లడించారు. నెల క్రితమే లేఖ రాసినట్టు తెలిపారు. ‘షీనా బోరాను శ్రీనగర్లో చూశాను’ అని ఓ మహిళా అధికారి చెప్పినట్టు ఇంద్రాణీ లేఖలో పేర్కొన్నారు. షీనా బోరా 2012లో హత్యకు గురయ్యారు. మూడేండ్ల తర్వాత విషయం బయటకు వచ్చింది. ఇంద్రాణీ, ఆమె రెండో భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ కలిసి ఆమె గొంతు నులిమి హత్య చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఇంద్రాణీ మూడో భర్త పీటర్ ముఖర్జీ మొదటి భార్య కుమారుడితో షీనా ప్రేమాయణం సాగించడం, తల్లి, కూతుళ్ల మధ్య ఆర్థిక వివాదాలు రేగడంతో ఆమెను హత్య చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇంద్రాణీ లేఖపై సీబీఐ స్పందించలేదు.